ఎంఎస్ఎంఈ, డిజిటల్ బిజినెస్ల లిస్టింగ్కు చేయూత
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీషో తాజాగా బీఎస్ఈతో చేతులు కలిపింది. తద్వారా ప్రాజెక్ట్ శిఖర్ (Project Shikhar) పేరుతో కొత్త కార్యాచరణకు తెరతీసింది. ఇందుకు రెండు సంస్థలు అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తాజా ప్రాజెక్ట్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లు, డిజిటల్ బిజినెస్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు వెసులుబాటు కల్పించనున్నాయి.
వెరసి ఎంఎస్ఎంఈలతోపాటు.. అత్యున్నత పనితీరు చూపుతున్న స్వతంత్ర ఈకామర్స్ సంస్థలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలుగా అవతరించేందుకు దారి ఏర్పడనుంది. దీంతో వృద్ధి అవకాశాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. చురుకైన, ఉపాధి కల్పనకు వీలున్న బిజినెస్లు ప్రత్యక్షంగా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించేందుకు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అత్యున్నత అవకాశాలను కల్పిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ వందలకొద్దీ సంస్థల లిస్టింగ్కు దారి చూపినట్లు తెలియజేశారు. తద్వారా వృద్ధి సంబంధ పెట్టుబడులు, పాలనాప్రమాణాల మెరుగుకు సహకరించినట్లు వివరించారు. మీషోతో తాజా భాగస్వామ్యం ద్వారా ఎస్ఎంఈలు, ఈకామర్స్ విక్రేతలకు లిస్టింగ్ అవకాశాలు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: లీటర్పై 20 రూపాయల డిస్కౌంట్!


