ఐపీఓకు దూత్‌ ట్రాన్స్‌మిషన్‌ | ipo dhoot transmission files revised drhp sebi | Sakshi
Sakshi News home page

ఐపీఓకు దూత్‌ ట్రాన్స్‌మిషన్‌

May 24 2026 7:32 AM | Updated on May 24 2026 7:36 AM

ipo dhoot transmission files revised drhp sebi

ముంబై: ఆటో విడిభాగాల తయారీ సంస్థ దూత్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ సెబీకి సవరించిన ముసాయిదా పత్రాలు (యూడీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. దాఖలు చేసిన యూడీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. ఈ ఐపీఓలో రూ.1,400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.

అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్‌ కంపెనీలు మొత్తం 1.63 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టాయి. ఇందులో ‘బైన్‌ క్యాపిటల్‌’ దాదాపు 1.32 కోట్ల షేర్లను, ‘మంగళం క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ 31.18 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనున్నట్లు యూడీఆర్‌హెచ్‌పీలో పేర్కొంది.

పబ్లిక్‌ ఇష్యూ పూర్తైన తర్వాత కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి. దూత్‌ ట్రాన్స్‌మిషన్‌ సంస్థ 1999లో ప్రారంభమైంది. ఆటోమొబైల్‌ రంగానికి అవసరమైన వైరింగ్‌ హార్నెస్‌లు, ఎల్రక్టానిక్‌ సెన్సర్లు, కనెక్టర్లు, జంక్షన్‌ బాక్సులు, డేటా కేబుళ్లు తదితర భాగాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(ఆర్థిక సంవత్సరం 2025–26)లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.3,444.86 కోట్లకు చేరగా, నికర లాభం రూ.353.89 కోట్లుగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement