మార్కెట్ల పోల్‌వాల్ట్‌- 835 పాయింట్లు అప్

Market pole vault- Sensex 835 points jumps  - Sakshi

37,389 వద్ద ముగిసిన సెన్సెక్స్‌

245 పాయింట్లు జూమ్‌- 11,050 వద్ద నిలిచిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3.5-2 శాతం మధ్య ప్లస్

‌ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌  3-2.3 శాతం చొప్పున అప్‌

ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు అనూహ్య బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీతోనూ, నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 835 పాయింట్లు దూసుకెళ్లి  37,389 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 245 పాయింట్లు జంప్‌చేసి 11,050 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు ముగిశాయి.  

ఆటో, ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3.5-2 శాతం మధ్య బలపడ్డాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్‌, బ్యాంకింగ్‌, ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫిన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్, టీసీఎస్‌, ఐసీఐసీఐ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, మారుతీ 6.7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఎస్‌బీఐ లైఫ్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌ మాత్రమే అదికూడా 1-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో అశోక్‌ లేలాండ్‌, ఐడియా, జీఎంఆర్‌, కోఫోర్జ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, మణప్పురం, ముత్తూట్‌, జిందాల్‌ స్టీల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌, ఎక్సైడ్‌, మదర్‌సన్‌, నాల్కో, టాటా పవర్‌, ఐబీ హౌసింగ్‌, బయోకాన్‌, ఎన్‌ఎండీసీ, కెనరా బ్యాంక్‌, బీవోబీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 13.5- 4.7 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. ఈ విభాగంలో హావెల్స్‌, సీమెన్స్‌ మాత్రమే అదికూడా 1-0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3-2.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,984 లాభపడగా.. కేవలం 664 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top