Sakshi News home page

బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు

Published Wed, May 3 2023 9:15 AM

Large corporates will never be allowed to open a bank in India veteran banker Vaghul - Sakshi

ముంబై: భారత్‌లో బడా కార్పొరేట్లను ఎప్పటికీ బ్యాంకింగ్‌ వ్యాపారంలోకి అనుమతించొద్దని వెటరన్‌ బ్యాంకర్‌ ఎన్‌ వాఘుల్‌ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల జాతీయీకరణకు ముందు అనుభవాల నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకుందంటూ.. బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లను అనుమతించి అవే తప్పులను పునరావృతం కానీయవద్దన్నారు. రెండేళ్ల క్రితం ఆర్‌బీఐ చర్చా పత్రం కార్పొరేట్లను బ్యాంకుల్లోకి అనుమతించడాన్ని ప్రస్తావించింది.

ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్‌ వసూళ్ల రికార్డు

కార్పొరేట్‌ సంస్థలు అయితే నిధులు సమీకరించే సత్తా ఉంటుందని, అది దేశ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వాఘుల్‌ ఈ విధంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి రావాలని వాఘుల్‌ అన్నారు. ప్రొఫెషనల్‌గా నడిచే బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే కావాలన్నారు. వచ్చే దశాబ్దంలో అంతా డిజిటల్‌ బ్యాంకింగ్‌ హవాయేనంటూ, అంతా ఫిన్‌టెక్‌ ఆధారితంగా ఉండొచ్చన్నారు.

ప్రాంతీయ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదన్న ప్రధాని మాటలను గుర్తు చేశారు. కనుక ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం ముందుకే వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో నిపుణులైన బోర్డుల ఆధ్వర్యంలో బ్యాంకులు నడిచే అవకాశం ఉంటుందన్నారు. వాఘుల్‌ గతంలో ఐసీఐసీఐ బ్యాంకింగ్‌కు సారథ్యం వహించడం గమనార్హం.

ఇదీ చదవండి: లాభాలతో అదరగొట్టిన పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌

Advertisement
Advertisement