ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ‘పసిడి పరుగులు’ | L and T Finance Gold Loan Expansion 3000 Branches 5 Years | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ‘పసిడి పరుగులు’

Sep 3 2026 2:49 PM | Updated on Sep 3 2026 2:54 PM

L and T Finance Gold Loan Expansion 3000 Branches 5 Years

డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ మరింత విస్తారంగా బంగారు రుణాల విడుదలను చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఐదేళ్లపాటు.. ఏడాదికి కనీసం 500 చొప్పున బంగారు రుణ బ్రాంచీలను జత చేసుకోవాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఐదేళ్లలో 2,500–3,000కు బ్రాంచీలను పెంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్, సీవోవో రాజు దొడ్తి పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 343 గోల్డ్‌ లోన్‌ బ్రాంచీల నెట్‌వర్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ముగిసేలోగా 800కు చేరుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు.

2025 జూన్‌లో చండీగఢ్‌ కంపెనీని సొంతం చేసుకోవడం ద్వారా 130 బ్రాంచీలతో గోల్డ్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. 2026 మార్చికల్లా వీటికి అదనంగా 200 బ్రాంచీలను జత చేసినట్లు తెలియజేశారు. రానున్న 4–5 ఏళ్లలో ప్రతీ ఏటా కనీసం 500 బ్రాంచీలను ఏర్పాటు చేయడం ద్వారా భారీ విస్తరణపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. వెరసి ఐదేళ్లలో 3,000 బంగారు రుణ బ్రాంచీల నెట్‌వర్క్‌ను సాధించాలని ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. బంగారు రుణాలలో వృద్ధికి సుప్రసిద్ధ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కొత్తగా మార్కెటింగ్‌ను ప్రారంభించిన సందర్భంగా రాజు కంపెనీ విస్తరణ ప్రణాళికలను వివరించారు.  

దేశం నలువైపులా.. 
తొలుత దేశ తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలపై దృష్టి పెట్టిసాగుతున్నామని, తదుపరి ఉత్తరాదిలోనూ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు రాజు వెల్లడించారు. అయితే విస్తరణలో ఒక ప్రాంతం తదుపరి మరో ప్రాంతంఅనికాకుండా వేగంగా దేశమంతటా కార్యకలాపాలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. గుజరాత్‌లో వార్షికంగా 50–60 బ్రాంచీలను తెరిచే వీలున్నట్లు పేర్కొన్నారు. 500 బ్రాంచీల ప్రణాళికలలో కనీసం 100 బ్రాంచీలను పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

2026 జూన్‌కల్లా కంపెనీ మొత్తం లోన్‌బుక్‌ రూ. 1.29 లక్షల కోట్లుకాగా.. గోల్డ్‌ ఫైనాన్స్‌ బుక్‌ విలువ రూ. 3,800 కోట్లను అధిగమించినట్లు వెల్లడించారు. బంగారు రుణ పోర్ట్‌ఫోలియో వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌–జూన్‌)లో 182 శాతం జంప్‌చేసి రూ. 3,829 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. గతేడాది(2025–26) ఇదే కాలంలో ఈ విలువ రూ. 1,360 కోట్లుగా నమోదైనట్లు ప్రస్తావించారు. లోన్‌బుక్‌ వార్షికంగా 20–25 శాతం పుంజుకోవచ్చని, అయితే బంగారు రుణాల్లో వృద్ధి మరింత అధికంగా 50 శాతం చొప్పున నమోదుకావచ్చని అంచనా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement