ఆధునిక మౌలిక వసతులు, ఐటీ విప్లవం, ఆర్థిక పురోగతితో దూసుకుపోతున్న భారతీయ మహానగరాలు పారిశుధ్య నిర్వహణలో మాత్రం వెనుకబడుతున్నాయి. ఈ చేదు నిజాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మెట్రో నగరాలు సైతం చెత్త నిర్వహణలో విఫలమవుతూ అత్యంత అశుభ్రమైన నగరాల జాబితాలో నిలవడం పట్టణ పాలన లోపాలను ఎత్తిచూపుతోంది.
దేశంలోనే అత్యంత అపరిశుభ్రమైన (తక్కువ పాయింట్లు సాధించిన) టాప్-10 నగరాల జాబితాలో తమిళనాడుకు చెందిన చారిత్రక నగరం మదురై ప్రథమ స్థానంలో నిలవగా, పంజాబ్లోని పారిశ్రామిక కేంద్రం లుధియానా, తమిళనాడు రాజధాని చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో అత్యంత అపరిశుభ్రమైన టాప్-10 నగరాలు
1. మదురై (తమిళనాడు)
2. లుధియానా (పంజాబ్)
3. చెన్నై (తమిళనాడు)
4. రాంచీ (జార్ఖండ్)
5. బెంగళూరు (కర్ణాటక)
6. ధన్బాద్ (జార్ఖండ్)
7. ఫరీదాబాద్ (హర్యానా)
8. గ్రేటర్ ముంబై (మహారాష్ట్ర)
9. శ్రీనగర్ (జమ్మూ, కశ్మీర్)
10. ఢిల్లీ
ఈ జాబితాను పరిశీలిస్తే కేవలం చిన్న పట్టణాలు మాత్రమే కాకుండా బెంగళూరు, గ్రేటర్ ముంబై, ఢిల్లీ వంటి ఆర్థిక శక్తులుగా వెలుగుందుతున్న మహా నగరాలు కూడా పారిశుధ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. 'గార్డెన్ సిటీ'గా పేరుగాంచిన బెంగళూరు 5వ స్థానంలో నిలవడం, రాజధాని ఢిల్లీ టాప్-10 జాబితాలో చేరడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
వైఫల్యానికి మూలకారణాలు
వేగవంతమైన పట్టణీకరణకు తగినట్లుగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు లేకపోవడం, తడి-పొడి చెత్త వేరుచేయడంలో పౌరుల భాగస్వామ్యం లోపించడం, ల్యాండ్ఫిల్ సైట్లపై ఎక్కువగా ఆధారపడటం ఈ నగరాల పతనానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండోర్, సూరత్ వంటి నగరాలు వినూత్న రీతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే ఈ 10 నగరాలు మాత్రం పారిశుధ్య మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్నాయి. కేవలం నిధుల కేటాయింపుతోనే స్వచ్ఛత సాధ్యం కాదని, ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనం, స్థానిక సంస్థల సమర్థత, పౌరుల్లో మార్పు వచ్చినప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!


