కనీసం రూ.52,600 జీతం ఇవ్వాలి.. | Indian Railways employees association demands 52600 minimum pay 8th Pay Commission | Sakshi
Sakshi News home page

కనీసం రూ.52,600 జీతం ఇవ్వాలి..

Jun 4 2026 1:41 PM | Updated on Jun 4 2026 2:08 PM

Indian Railways employees association demands 52600 minimum pay 8th Pay Commission

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష కోసం ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) ముందు భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) కీలక డిమాండ్లను ఉంచింది. రైల్వేలోని జూనియర్ ఇంజనీర్లు (JE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు (SSE) సహా టెక్నికల్‌ సూపర్‌వైజర్ల బాధ్యతలు, ప్రమాదభరిత విధులు, సాంకేతిక నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కనీస ప్రాథమిక వేతనాన్ని ప్రస్తుత స్థాయి కంటే గణనీయంగా పెంచి రూ.52,600గా నిర్ణయించాలని సంఘం కోరింది.

గత నెల హైదరాబాద్‌లో 8వ వేతన సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐఆర్టీఎస్ఏ సమగ్ర మెమోరాండం సమర్పించింది. సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. రమేష్ నేతృత్వంలోని బృందం రైల్వే టెక్నికల్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న కెరీర్‌ స్తబ్దత, పదోన్నతుల కొరత, వేతన అసమానతలు, భత్యాల సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

రైల్వే టిక్నికల్‌ సిబ్బంది డిమాండ్లు ఇవీ..
సంఘం ప్రతిపాదనల ప్రకారం, మొత్తం ఉద్యోగులందరికీ ఒకే ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ వర్తింపజేయకుండా పోస్టు స్థాయి, బాధ్యతల ఆధారంగా వేర్వేరు ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్లను అమలు చేయాలి. లెవల్-1 ఉద్యోగులకు 2.92, లెవల్-6 నుంచి 8 వరకు ఉన్న సాంకేతిక సిబ్బందికి 3.50, లెవల్-9 నుంచి 12 వరకు ఉన్న మధ్యస్థాయి అధికారులకు 3.80 ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని సూచించింది.

అలాగే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లకు గ్రూప్-బి గెజిటెడ్ హోదా కల్పించాలని, రైల్వేలో గ్రూప్-బి పోస్టుల సంఖ్యను పెంచాలని, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక రిస్క్‌, హార్డ్‌షిప్‌ అలవెన్సులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్‌టైమ్ అలవెన్స్, పీసీఓ అలవెన్స్ వంటి అంశాలపై కూడా పునఃసమీక్ష జరపాలని కోరింది.

ప్రస్తుతం 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, వివిధ శాఖల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, సంఘం తన సిఫార్సులను 18 నెలల్లో సమర్పించే అవకాశం ఉంది. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో, ఉద్యోగ సంఘాల డిమాండ్లన్నీ యథాతథంగా అమలవుతాయా లేదా అనేది నివేదిక అనంతరం స్పష్టత రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement