
జియో, ఎయిర్టెల్ జోరు
దేశీయంగా మే నెలలో టెలికం యూజర్ల సంఖ్య స్వల్పంగా 43,58,231 మేర పెరిగి 120.7 కోట్లకు చేరింది. కొత్త యూజర్లలో సింహభాగం 99.84 శాతం వాటాను (43,51,294 కనెక్షన్లు) రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ దక్కించుకున్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ విభాగంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92 శాతం మార్కెట్ వాటా ఉంది.
ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన
భారతీ ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకు చేరగా, 33.61 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అయితే సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 2.74 లక్షల మంది, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.35 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. వైర్లైన్ సెగ్మెంట్లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్టెల్ యూజర్లు 99,000, టాటా టెలీసర్వీసెస్ సబ్స్క్రైబర్స్ 4,890, వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ అత్యధికంగా 66,834 మంది, బీఎస్ఎన్ఎల్ 46,000 మంది కస్టమర్లను కోల్పోయాయి. దేశీయంగా మొత్తం ల్యాండ్లైన్ కనెక్షన్లు 3.34 శాతం పెరిగి 3.86 కోట్లకు, మొబైల్ కనెక్షన్లు 116.84 కోట్లకు చేరాయి. ఏప్రిల్లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు.