రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారుల కోసం మరో సంచలన ప్యాక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందుబాటు ధరలో అపరిమిత వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ‘జియోటీవీ ప్రో ప్యాక్’ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.55 ధరతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు సరికొత్త వినోదాన్ని ఆస్వాదించవచ్చని చెప్పింది.
30 రోజుల వాలిడిటీ.. 1,000కు పైగా ఛానళ్లు!
ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు ‘జియోటీవీ’ మొబైల్ యాప్లో 30 రోజుల పాటు ఏకంగా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో వినియోగదారులు సాధారణ ఛానళ్లతో పాటు 150కు పైగా ప్రీమియం ఛానళ్లను కూడా అదనపు ఖర్చు లేకుండా చూడవచ్చు. సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్ను డిజైన్ చేసినట్లు చెప్పింది. 16కు పైగా భాషల్లో జనరల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్స్టైల్, ప్రాంతీయ కార్యక్రమాలకు చెందిన విస్తృతమైన కంటెంట్ ఈ ప్యాక్లో లభిస్తుంది.

ప్రముఖ నెట్వర్క్ల ప్రీమియం కంటెంట్
జియోటీవీ ప్రో ప్యాక్లో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, స్టార్ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ హెచ్డీ, సోనీ ఎస్ఏబీ హెచ్డీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్.. వంటి ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, క్రీడాభిమానులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జియోస్టార్, సోనీ నెట్వర్క్లకు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు మాత్రం ఈ రూ.55 ప్యాక్లో భాగం కావు.
యాక్టివేషన్ సులభం.. ఎలా పొందాలంటే?
మొదట మీ మొబైల్ నంబర్కు రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ యాప్ ఓపెన్ చేసి జియో మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే లైవ్ టీవీ సేవలు నిరంతరాయంగా ప్రారంభమవుతాయి.
నిబంధనలు.. ఫీచర్లు
ఈ రూ.55 ప్యాక్ కేవలం వినోద సేవలకు మాత్రమే పరిమితం. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ సేవను వినియోగించుకోవాలంటే కస్టమర్ మొబైల్లో ఏదైనా ఒక యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ ప్లాన్ రన్ అవుతూ ఉండాలి. జియోటీవీ యాప్ ద్వారా కేవలం ఒకే ఒక్క మొబైల్లో ఈ సేవలను వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ మైజియో యాప్, జియో అధికారిక వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ జియో రీఛార్జ్ కేంద్రాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..


