ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 26 శాతం వృద్ధి | Gross Direct Tax collections for the Financial Year FY-2022 | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 26 శాతం వృద్ధి

Dec 19 2022 6:27 AM | Updated on Dec 19 2022 6:27 AM

Gross Direct Tax collections for the Financial Year FY-2022 - Sakshi

న్యూఢిల్లీ:  ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత 2022–23) ఇంకా దాదాపు మూడు నెలలుపైగా మిగిలి ఉండగానే ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యంవైపునకు దూసుకుపోతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 17వ తేదీ నాటికి ప్రత్యక్ష  పన్ను వసూళ్లు స్థూలంగా 26 శాతం వృద్ధితో రూ.13,63,649 కోట్లుగా నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్‌ లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతం. అధికారిక సమాచారం ప్రకారం, స్థూల వసూళ్లలో రిఫండ్స్‌ విలువ రూ.2.28 లక్షల కోట్లు. ఇవి పోను నికరంగా వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థూల వసూళ్లలో కార్పొరేట్‌ పన్ను (సీఐటీ) విలువ రూ.7.25 లక్షల కోట్లు. ఎస్‌టీటీ (సెక్యూరిటీస్‌ ట్రాన్జాక్షన్‌ ట్యాక్స్‌)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (పీఐటీ) వసూళ్లు రూ.6.35 లక్షల కోట్లు.  

మొత్తం లక్ష్యం రూ.27.50 లక్షల కోట్లు..
2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు.  అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్‌టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం.

Advertisement
 
Advertisement
Advertisement