
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గతేడాది (2024) భారత్లో 29 లక్షల అడ్వర్టైజర్ల ఖాతాలను సస్పెండ్ చేసింది. అడ్వర్టైజింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 24.74 కోట్ల ప్రకటనలను తొలగించింది. అంతర్జాతీయంగా 3.92 కోట్ల అడ్వర్టైజర్ అకౌంట్లను సస్పెండ్ చేయగా 510 కోట్ల ప్రకటనలను తొలగించింది. 910 కోట్ల ప్రకటనలపై ఆంక్షలు విధించింది. వార్షిక యాడ్స్ సేఫ్టీ నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది.
సంక్లిష్టమైన విచారణలను వేగవంతం చేసేందుకు, అకౌంట్ సెటప్ సమయంలో పేమెంట్లకు సంబంధించి తప్పుడు వివరాలను సత్వరం పసిగట్టేలా తమ వ్యవస్థలను పటిష్టం చేసుకున్నట్లు గూగుల్ పేర్కొంది. మోసాలను నివారించే దిశగా స్కామ్లను ప్రమోట్ చేసే అడ్వర్టైజర్లను సస్పెండ్ చేయడంలాంటి చర్యలు తీసుకునేందుకు 100కు పైగా నిపుణులతో ఏర్పాటు చేసిన బృందం తమ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసినట్లు వివరించింది. దీంతో స్కామ్ యాడ్లపై ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు తెలిపింది.