Google to Make Substantial Investment in Bharti Airtel - Sakshi
Sakshi News home page

Jio Vs Airtel: జియో వర్సెస్‌ ఎయిర్‌టెల్‌ ! గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం ?

Aug 28 2021 4:31 PM | Updated on Aug 28 2021 7:34 PM

Google Planning To Invest Huge Funds In Airtel Consultation Going On - Sakshi

టెలికాం రంగంలో పెట్టుబడులకు  ఎయిర్‌టెల్‌తో  చర్చలు జరుపుతున్న గూగుల్‌?

భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానమే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోంది. దీన్ని నిజం చేస్తూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి. 

ఇండియా టెలికాం  సెక్టార్‌లోకి గూగుల్‌?
టెక్‌ దిగ్గజం, నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ఇండియాలోని టెలికాం సెక్టార్‌పై గురి పెట్టింది, టెలికాం పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఇండియాలో పాగా వేసేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌లో రూ. 34,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారీ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది.

ఎయిర్‌టెల్‌తో చర్చలు
టెలికాం సెక్టార్‌లో జియో నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌లో భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని, చాలా అంశాలపై స్పష్టత వచ్చిందని, త్వరలోనే ఈ డీల్‌ కార్యరూపం దాల్చనుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది. ఈ డీల్‌ ఇండియాలోనే అతి పెద్ద డీల్‌ అ‍య్యే అవకాశం ఉందని కూడా టైమ్స్‌ పేర్కొంది.

గూగుల్‌ వస్తే..
ఎయిర్‌టెల్‌, గూగుల్‌ల మధ్య ఒప్పందం కుదిరితే టెలికాం రంగంలో మరోసారి ప్రైస్‌వార్‌ తప్పదని, దాని వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు అందుతాయనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో టాటా డొకోమో రాకతో కాల్‌ పల్స్‌ రేట్లు తగ్గిపోగా జియో రాకతో డేటా, కాల్‌ ఛార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎయిర్‌టెల్‌, జియోల మధ్య ఒప్పందం ఫైనల్‌ అయితే టెలికాం రంగంలో ప్రైస్‌వార్‌ తప్పదు.

టెలికాంలో గట్టిపోటీ
అమెరికా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్‌ అయిన ఇండియాపై టెక్‌ దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్‌దే అగ్రస్థానం. దేశంలో ఉన్న ఫోన్లలో నూటికి డెబ్బై శాతం ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫారమ్‌ మీదే పని చేస్తున్నాయి. మరోవైపు జియోతో భాగస్వామ్యంలో భాగంగా జియో నెక్ట్స్‌ పేరుతో బడ్జెట్‌ ఫోన్‌ను గూగుల్‌ ఇండియాలో ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో కీలక భాగస్వామి కానుంది.
 

చదవండి : Google-Apple Deal: గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కోసం లక్షా పదివేల కోట్లు! అంతకంతకు పెరుగుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement