పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ప్రభావం దేశీయంగా ఎల్పీజీ సరఫరాపై పడుతోంది. దాంతో పలు ప్రాంతాల్లో సిలిండర్ల కొరత తలెత్తుతోంది. ఈ తరుణంలో సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే గ్యాస్ పొదుపు ఒక్కటే మార్గమని కొందరు చెబుతున్నారు.
వంట పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా 25 శాతం వరకు గ్యాస్ ఆదా చేయవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సూచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్న స్మార్ట్ చిట్కాలు కింద చూద్దాం.
మంటను తగ్గించండి..
చాలామంది నీళ్లు మరిగే వరకు లేదా వంట పూర్తయ్యే వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోనే ఉంచుతారు. కానీ, నీరు ఒకసారి మరిగిన తర్వాత వేడిని తగ్గించడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. దాంతో గ్యాస్ వృధా కాదు. ఇలా సిమ్లో వండటం వల్ల 25 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుందని ఇండియన్ ఆయిల్ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.
ప్రెజర్ కుక్కర్..
సాంప్రదాయ పాత్రలతో పోలిస్తే ప్రెజర్ కుక్కర్ వాడకం వల్ల చాలా సమయం, గ్యాస్ కలిసొస్తుంది. బియ్యంతో అన్నం వండేప్పుడు 20% ఆదా, పప్పు ధాన్యాలు.. 46% ఆదా, మాంసాహారం.. 41.5% ఆదా అవుతుంది.
నానబెట్టడం మర్చిపోవద్దు
పప్పులు, బియ్యం లేదా శనగలు వంటి గట్టి పదార్థాలను వండే ముందు కనీసం గంట సేపు నానబెట్టాలి. ఉదాహరణకు, శనగలను రాత్రిపూట నానబెట్టడం వల్ల వండేటప్పుడు 22 శాతం గ్యాస్ వినియోగం తగ్గుతుంది.
మీ గ్యాస్ బర్నర్ మంట నీలి రంగులో ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే బర్నర్ రంధ్రాల్లో చెత్త లేదా కార్బన్ పేరుకుపోయిందని అర్థం. వెంటనే వాటిని శుభ్రం చేయాలి.
పాత్రలను కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టకండి. ముందుగా పొడి గుడ్డతో పాత్రలు తుడిచి ఆ తర్వాతే స్టవ్ మీద పెట్టండి. ఆ నీటిని ఆవిరి చేయడానికి కూడా గ్యాస్ వృధా అవుతుందని గుర్తుంచుకోండి.
చిన్న పాత్రలకు పెద్ద బర్నర్ వాడటం వల్ల వేడి పక్కల నుంచి వృధాగా పోతుంది. చిన్న బర్నర్లను ఉపయోగించడం వల్ల పెద్ద వాటితో పోలిస్తే 6% నుంచి 10% తక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.
పొయ్యి వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం, మసాలాలు వెతుక్కోవడం వంటివి చేయకండి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగిస్తే అనవసరపు వేచి చూసే సమయం తగ్గుతుంది.
అంతర్జాతీయ పరిణామాలు గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతున్న తరుణంలో బుకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ఇంటి బడ్జెట్ను కాపాడుకోవచ్చు.
ఇదీ చదవండి: రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు


