సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందంటూ ఆరోపించారు. దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు.
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని, హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్కు బదులుగా నార్వే కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్ కారణంగా ఉందని పూరి అన్నారు.
LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని, సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ, ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.

కాగా గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.


