గతేడాది ఎఫ్‌డీఐలు డీలా | FDI Deal | Sakshi
Sakshi News home page

గతేడాది ఎఫ్‌డీఐలు డీలా

Jun 1 2024 8:59 AM | Updated on Jun 1 2024 8:59 AM

FDI Deal

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 3.5 శాతం క్షీణించాయి. 44.42 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా సరీ్వసెస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు పెట్టుబడులు తగ్గడం ప్రభావం చూపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో 46.03 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి. అయితే గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో మాత్రం 33 శాతంపైగా జంప్‌ చేశాయి. 

12.38 బిలియన్‌ డాలర్లు ప్రవహించాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 9.28 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈక్విటీ పెట్టుబడులు, లాభార్జన, ఇతర మూలధనంతో కూడిన మొత్తం ఎఫ్‌డీఐలను పరిగణిస్తే గతేడాది నామమాత్రంగా 1 శాతం నీరసించి 70.95 బిలియన్‌ డాలర్లను తాకాయి. 2022–23లో ఇవి 71.35 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) వివరాల ప్రకారం 2021–22లో దేశ చరిత్రలోనే అత్యధికంగా 84.83 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి.

రంగాల వారీగా..
గతేడాది మారిషస్, సింగపూర్, యూఎస్, యూఏఈ, కేమన్‌ ఐలండ్స్, జర్మనీ, సైప్రస్‌ తదితర ప్రధాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు నీరసించాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్‌ నుంచి ఎఫ్‌డీఐలు పుంజుకోవడం గమనార్హం! ఇక రంగాలవారీగా చూస్తే సర్వీసెస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ట్రేడింగ్, టెలికం, ఆటోమొబైల్, ఫార్మా, కెమికల్స్‌కు పెట్టుబడులు తగ్గాయి. మరోపక్క నిర్మాణ రంగ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, అభివృద్ధి, విద్యుత్‌ రంగాలు అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. గతేడాది మహారాష్ట్ర అత్యధికంగా 15.1 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలను అందుకోగా.. గుజరాత్‌కు 7.3 బి.డా. లభించాయి. 2022–23లో ఇవి వరుసగా 14.8 బి.డా, 4.7 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement