రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. అవి మార్చుకోవాల్సిందే! | FASTag New rules will come into effect from August 1 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. అవి మార్చుకోవాల్సిందే!

Jul 31 2024 7:17 PM | Updated on Jul 31 2024 9:02 PM

FASTag New rules will come into effect from August 1

వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్‌ ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్‌ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్‌ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.

నూతన నిబంధనలు ఇవే..
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్‌ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.

ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్‌లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్‌ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.

ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్‌ ప్రొవైడర్లు అప్‌లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement