Stocks Market: లాభాల ‘సిక్సర్‌’ | D-Street rally continues for 6th day on RBI support: Sensex adds 187 pts and Nifty 24167 | Sakshi
Sakshi News home page

Stocks Market: లాభాల ‘సిక్సర్‌’

Apr 23 2025 2:30 AM | Updated on Apr 23 2025 2:30 AM

D-Street rally continues for 6th day on RBI support: Sensex adds 187 pts and Nifty 24167

ఆరో రోజూ కొనసాగిన ర్యాలీ 

బ్యాంకింగ్‌ షేర్లకు భారీ డిమాండ్‌

ముంబై: బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.

అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్‌ పావెల్‌ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్‌ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్‌ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్‌ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.

⇒ బీఎస్‌ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్‌ఎంసీజీ 2%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 1.5% లాభప డ్డాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లు 1% రాణించాయి. 
⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది.  

మైక్రోఫైనాన్స్‌ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్‌ అడిట్‌ కోసం  ఎర్నెస్ట్‌–యంగ్‌ నియమించుకుందనే వార్తలతో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్‌ దాస్‌ భీంజీ ఝవేరీ(టీజీజెడ్‌) 6%, స్కై గోల్డ్‌ 5%, సెన్కో గోల్డ్‌ 3 శాతం లాభపడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement