ఎస్‌ఎస్‌ఈలో సీజీఆర్‌ లిస్టింగ్‌  | CSR first environmental NGO to launch issue on NSE Social Stock Exchange | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఈలో సీజీఆర్‌ లిస్టింగ్‌ 

May 17 2025 6:30 AM | Updated on May 17 2025 6:30 AM

CSR first environmental NGO to launch issue on NSE Social Stock Exchange

ఎన్‌ఎస్‌ఈలో తొలి పర్యావరణ ఎన్‌జీవో 

హైదరాబాద్‌: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ప్రవేశపెట్టిన సోషల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎస్‌ఎస్‌ఈ)లో హైదరాబాద్‌ సంస్థ కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌(సీజీఆర్‌) లిస్ట్‌కానుంది. తద్వారా ఎస్‌ఎస్‌ఈలో లిస్టయిన తొలి పర్యావరణ ఎన్‌జీవోగా సీజీఆర్‌ నిలవనుంది. యంగ్‌ ఎర్త్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ రెండో దశ(వైఈఎల్‌పీ–2)కు నిధుల సమీకరణ లక్ష్యంగా రూ. 85 లక్షల విలువైన ఈ ఇష్యూ వెలువడింది. 

ఈ నెల 7న ప్రారంభమైన ఇష్యూ 27వరకూ కొనసాగుతుంది. కఠిన పరిశీలనల తదుపరి ఎస్‌ఎస్‌ఈలో 14వ సంస్థగా సీజీఆర్‌ లిస్ట్‌కానున్నట్లు సంస్థ సీఈవో జి.నారాయణ రావు పేర్కొన్నారు. సెబీ అనుమతించిన జీరో కూపన్‌ జీరో ప్రిన్సిపల్‌(జెడ్‌సీజెడ్‌పీ) బాండ్ల రూపేణా నిధులను సమీకరించనుంది. వడ్డీ, అసలు ఆఫర్‌ చేయని ఈ బాండ్ల కొనుగోలుదారులు 80జీ ఆదాయపన్ను లబ్దిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దేశీయంగా 3,300 ఎన్‌జీవోలు రిజిస్టర్‌కాగా, వీటిలో సుమారు 100 మాత్రమే ఎస్‌ఎస్‌ఈలో లిస్టయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు రావు తెలియజేశారు. 

ఎస్‌ఎస్‌ఈలో ఒకసారి రిజిస్టరైతే ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈలక్ష లిస్టయ్యేలోపు పలు కఠిన ప్రొటోకాల్స్‌ను ఎదుర్కోవలసి ఉంటుందని వివరించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని పీఎస్‌యూ భారత్‌ డైనమిక్స్‌ జీఎంగా గతంలో రావు పనిచేశారు.  కాగా.. ఎస్‌ఎస్‌ఈలో లిస్టయిన తొలి సంస్థగా బెంగళూరుకు చెందిన ఎన్‌జీవో ఎస్‌జీబీఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌ రికార్డు సృష్టించింది. 2022 డిసెంబర్‌లో ఈ సంస్థ సంపన్నవర్గాల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి రూ. 2 కోట్లవరకూ సమీకరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement