
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా గ్రోశక్తి ప్లస్ అనే ఉత్పాదనను బుధవారం ప్రవేశపెట్టింది. జింక్తోపాటు నత్రజని, భాస్వరం, పొటాషియంతో ఈ ఎరువు తయారైంది. సంక్లిష్ట ఎరువుల్లో అత్యధిక పోషకాలు, ఎన్పీకే ఎరువుల్లో అధిక భాస్వరం గ్రోశక్తి ప్లస్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల వంటి పంటలకు ఇది అనుకూలం అని వివరించింది. ఎన్ఫోస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఉత్పాదన ద్వారా పంటలకు సమతుల పోషకాలు అందుతాయని కోరమాండల్ మాతృ సంస్థ మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.