సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు | India Boosts Fertilizer Sector with 95 Gas Allocation Amid West Asia Tensions | Sakshi
Sakshi News home page

సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు

Apr 9 2026 9:04 AM | Updated on Apr 9 2026 9:13 AM

India Boosts Fertilizer Sector with 95 Gas Allocation Amid West Asia Tensions

వ్యవసాయ రంగానికి ఊరట

దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.

పెరిగిన కేటాయింపులు

గత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్‌ఎన్‌జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్‌సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్‌సీఎం గ్యాస్‌తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్‌సీఎంల గ్యాస్‌ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement