2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్క‌ర‌ణ‌! | Sakshi
Sakshi News home page

2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్క‌ర‌ణ‌!

Published Thu, Jan 6 2022 5:12 PM

CES 2022: BlueSemi unleashed EYVA, A Consumer Healthcare Gadget - Sakshi

న్యూఢిల్లీ: ప్ర‌జ‌ల‌కు సులువుగా త‌మ ఆరోగ్యాన్ని ప‌రీక్షించుకుంటూ, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు స‌రికొత్త మార్గాన్ని అందిస్తూ హైదరాబాద్ నగరానికి చెందిన బ్లూసెమీ అనే భార‌తీయ హెల్త్‌ టెక్ స్టార్ట‌ప్ కంపెనీ అమెరికాలోని లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న సీఈఎస్ 2022లో ఈవైవీఏ (EYVA) అనే విప్ల‌వాత్మ‌క ఉత్ప‌త్తిని ఆవిష్క‌రించింది. ఇది నాన్ ఇన్వేజివ్ క‌న్స్యూమ‌ర్ హెల్త్‌ టెక్ ప‌రిక‌రం. ఇందులో సృజ‌నాత్మ‌క‌మైన పేటెంట్ టెక్నాల‌జీ ఆధారిత సెన్స‌ర్ ఫ్యుజ‌న్, క‌చ్చిత‌మైన ఏఐ ఆల్గ‌రిథ‌మ్స్, స్మార్ట్ ఐఓటీ ఉన్నాయి. ఈవైవీఏ ఆవిష్క‌ర‌ణ‌తో, బ్లూసెమీ సంస్థ సీఈఎస్‌లో ఇలాంటి ప‌రిక‌రాన్ని ఆవిష్క‌రించిన మొట్ట‌మొద‌టి భార‌తీయ సంస్థ‌గా నిలిచింది. సీఈఎస్ అనేది ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌భావ‌వంతమైన టెక్ ఈవెంట్‌. 

అరచేతిలో ఆరోగ్యం
ఈ ప‌రిక‌రం మ‌నిషి శ‌రీరంలోని 6 కీల‌క వైట‌ల్స్‌ను గుర్తిస్తుంది. అవి ర‌క్తంలో గ్లూకోజ్, ఈసీజీ, గుండె కొట్టుకునే రేటు, బీపీ, ఎస్‌పీఓ2, ఉష్ణోగ్ర‌త‌. గుచ్చ‌డం, ర‌క్తం తీయ‌డం లాంటివి అవ‌స‌రం లేకుండా ఇలా ముట్టుకుంటే అలా కేవ‌లం 60 సెకండ్ల‌లోనే ఈ వివ‌రాల‌న్నీ వ‌చ్చేస్తాయి. భార‌త‌దేశంలో కేవ‌లం రూ. 15,490/- ఖ‌ర్చుతో వ‌చ్చే ఈ ప‌రిక‌రంతో పాటు ఉచిత మొబైల్ యాప్ కూడా అందిస్తారు. దీని ద్వారా వినియోగ‌దారులు త‌మ ఆరోగ్య విష‌యాలు తెలుసుకుని, జీవ‌న‌శైలి, ఫిట్‌నెస్‌, పోష‌కాహారం, ఒత్తిడి నివార‌ణ వంటి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. ఇంకా కావాలంటే పెయిడ్ ప్లాన్స్ ఎంచుకుని, మ‌రింత లోతుగా తెలుసుకుని, త‌మ ఆహారం, వ్యాయామంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోవ‌చ్చు. 

యాంథియా రీల్మ్
ఈవైవీఏలో కేవ‌లం అద్భుత‌మైన టెక్నాల‌జీ మాత్ర‌మే కాదు.. ఆరోగ్యం గురించిన దాని ఆలోచ‌నా విధానం కూడా చాలా కీల‌కం. ఇది ప్ర‌స్తుత ప్ర‌పంచంలో త‌న మొబైల్ యాప్ ద్వారా అన్నింటినీ అందిస్తోంది. యాంథియా రీల్మ్((Anthea Realm)) అనే ఈ యాప్ మీతోనే ఉండి మీ ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది. దీనిద్వారా యూజ‌ర్ త‌న‌తో తాను అనుసంధాన‌మై త‌న‌కు తాను సాయం చేసుకోగ‌ల‌డు. యాంథియా ప్ర‌పంచం మీకు ఓదార్పునిస్తుంది. ఇన్నాళ్లూ బాగా క‌ష్టంగా, బోరింగ్‌గా ఉండే ఆరోగ్య విష‌యాల‌ను అద్భుతంగా, ఆశ్చ‌ర్యం గొలిపేలా మార్చేసేందుకు దీన్ని రూపొందించారు. ఈ గాడ్జెట్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. చిన్న‌గా, స‌న్న‌గా ఉండి మీరెక్క‌డున్నా, మీతోపాటు ఉండి మొత్తం ఆరోగ్యాన్ని మీ సొంతం చేస్తుంది. మీకు కాలంతో పాటు ప్ర‌యాణించేలా భావ‌న క‌లిగిస్తుంది. 

ఈ అద్భుత‌మైన ప‌రిక‌రం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బ్లూసెమీ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో సునీల్ మ‌ద్దిక‌ట్ల మాట్లాడుతూ.. “ఈ ప్ర‌పంచాన్ని మ‌రింత మెరుగ్గా, ఆరోగ్య‌వంతంగా చేసేందుకు మేం ప‌డిన క‌ష్టానికి, మా నిబ‌ద్ధ‌త‌కు ఫ‌లిత‌మే ఈవైవీఏ. ఈ అసాధార‌ణ ప‌రిక‌రాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షోలో మొట్ట‌మొద‌టి భార‌తీయ హెల్త్‌ టెక్ కంపెనీగా ప‌రిచ‌యం చేసినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. ఏదైనా ప‌రిక‌రం విజ‌య‌వంతం కావాలంటే అది యూజ‌ర్ల‌కు అనుకూలంగా ఉండాలి. ఈవైవీఏ అందులో నూరుశాతం విజ‌య‌వంత‌మైంది. ఇది విభిన్నంగా, ఆక‌ర్ష‌ణీయంగా, చిన్న‌గా, స‌న్న‌గా ఉంటూ, సుల‌భంగా తీసుకెళ్ల‌గ‌లిగేలా ఉండి, ఉప‌యోగించ‌డంలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌జేయ‌దు. కేవ‌లం వేలి కొన‌ల స్ప‌ర్శ‌తోనే ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేంత విప్ల‌వాత్మ‌కంగా ఈ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం ఉంటుంది” అన్నారు. 

“ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈవైవీఏ లాంటి ప‌రిక‌రాలు ఇల్లు, ఆఫీసు, ప్ర‌జార‌వాణా, విమానాశ్ర‌యం, రైల్వేస్టేష‌న్, మార్కెట్.. ఇలా ఎక్క‌డున్నా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ ఉత్ప‌త్తిని రూపొందించ‌డం శాస్త్రీయ అవ‌స‌రంతో పాటు, నిరంత‌ర ఆవిష్క‌ర‌ణ విష‌యంలో మా అభిరుచికి నిద‌ర్శ‌నం. ప్ర‌తి ఒక్క‌రూ ఈ కొత్త ఆరోగ్య‌క‌ర ప్ర‌పంచంలో భాగం కావాల‌ని బ్లూసెమీలో మేం ఆహ్వానిస్తున్నాం. ఈవైవీఏ మ్యాజిక్‌తో జీవితాన్ని ఆస్వాదించండి” అని సునీల్ తెలిపారు. 2022 మార్చినాటిక‌ల్లా ఈవైవీఏ బ్లూసెమీ మార్కెట్ భాగస్వాముల ద్వారా అందుబాటులోకి వచ్చే అవ‌కాశ‌ముంది. మొద‌ట్లో ప‌రిమితంగానే అందుబాటులో ఉన్నా, 2022 మ‌ధ్యనాటికి వివిధ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా వినియోగ‌దారులు అంద‌రికీ అందుబాటులోకి తేవాల‌ని కంపెనీ యోచిస్తోంది.

(చదవండి: బంపరాఫర్‌..! ఉచితంగా యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌!)

Advertisement
Advertisement