ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం | Cafe Coffee Day ceo Malavika Hegde is indeed the daughter of late SM Krishna | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం

Dec 10 2024 3:00 PM | Updated on Dec 10 2024 3:00 PM

Cafe Coffee Day ceo Malavika Hegde is indeed the daughter of late SM Krishna

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్‌ఎం కృష్ణ ఇటీవల కన్నుముశారు. ఆయన కుమార్తె మాళవిక హెగ్డే ప్రముఖ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణి. మంగళూరు కాఫీ ఘుమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టిన విషయం తెలిసిందే.

భర్త మరణం.. చెదరని విశ్వాసం

2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

సగానికిపైగా అప్పులు క్లియర్‌

కేఫ్‌ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్‌ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి: బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్‌ కూల్‌

భర్త, తండ్రిని కోల్పోయిన మాళవిక అధైర్య పడకుండా రెట్టించిన ఉత్సాహాంతో పని చేసి కంపెనీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసి లాభాల్లోకి తీసుకురావాలని శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement