ఎయిర్‌టెల్‌ చేతికి టెలిమీడియా వాటా

Bharti Airtel Inches up on Acquiring Stake in Bharti Telemedia - Sakshi

న్యూఢిల్లీ: డీటీహెచ్‌ విభాగం భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను తిరిగి సొంతం చేసుకోనున్నట్లు మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా పేర్కొంది. పీఈ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి ఈ వాటాను రూ. 3,126 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్‌లో కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా వార్‌బర్గ్‌కు చెందిన అనుబంధ సంస్థ లియన్‌ మెడో ఇన్వెస్ట్‌మెంట్‌ 2018లో భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను పొందింది. ఇందుకు రూ.2,310 కోట్లు వెచ్చించింది. కాగా.. తాజాగా టెలిమీడియాలో వాటాను నగదు చెల్లింపు, ఈక్విటీ జారీ ద్వారా సొంతం చేసుకోనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలియజేసింది. షేరుకి రూ. 600 ధరలో 3.64 కోట్ల ఎయిర్‌టెల్‌ షేర్లను వార్‌బర్గ్‌కు జారీ చేయనుంది. వీటికి జతగా రూ.1,038 కోట్లవరకూ నగదును సైతం చెల్లించనున్నట్లు వివరించింది. భారతీ టెలిమీడియా డీటీహెచ్‌ బిజినెస్‌ డిసెంబర్‌ కల్లా 1.7 కోట్లమంది సబ్‌స్క్రయిబర్లను కలిగి ఉంది.(చదవండి: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top