
క్యూ4లో లాభం 82 శాతం అప్ రూ. 2,626 కోట్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 82 శాతం ఎగిసి రూ. 2,626 కోట్లకు పెరిగింది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు, ట్రెజరీ లాభాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రధానమైన నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 6,063 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 96 శాతం ఎగిసి రూ. 3,428 కోట్లుగా నమోదైంది.
రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు 195 శాతం పెరిగి రూ. 1,193 కోట్లకు, ట్రెజరీ లాభాలు 87 శాతం వృద్ధి చెంది రూ. 711 కోట్లకు చేరడమనేది ఇతర ఆదాయం పెరగడానికి దోహదపడింది. మరోవైపు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.92 శాతం నుంచి 2.61 శాతానికి తగ్గింది. రుణాల వృద్ధి 13.74 శాతంగా ఉన్నప్పటికీ వడ్డీ ఆదాయం నెమ్మదించడానికి ఇది కారణంగా నిల్చింది. అటు సమీక్షాకాలంలో మొత్తం డిపాజిట్లు 10.65 శాతం పెరగ్గా, కాసా (కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంట్) వాటా 40.28 శాతానికి తగ్గింది. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 17.77 శాతంగా ఉంది.
12 శాతం రుణ వృద్ధి లక్ష్యం ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధి, 11–12 శాతం డిపాజిట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ రజనీష్ కర్ణాటక్ తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ కార్పొరేట్ రుణాల పైప్లైన్ సుమారు రూ. 60,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నందున నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చని రజనీష్ చెప్పారు.