రిటైలర్లు, ఉద్యోగులకు ఓపెన్
సంస్థాగత ఇన్వెస్టర్ల భారీ బిడ్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విండో నేడు(25న) రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఓపెన్ కానుంది. గత వారాంతాన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఆఫర్కు 2.35 రెట్లు అధికంగా స్పందన లభించింది. తొలి రోజు(22న) రూ. 2,380 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్ను వినియోగించుకోవడం ద్వారా బ్యాంక్లో మొత్తం 8 శాతం వాటా విక్రయించనున్నట్లు దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా ఎక్స్లో పేర్కొన్నారు. ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రభుత్వం తొలుత 4 శాతం వాటా ఆఫర్ చేసింది.
అధిక స్పందన లభిస్తే మరో 4 శాతం వాటా సైతం విక్రయించనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 31కాగా.. 8 శాతం వాటాకు ప్రభుత్వం రూ. 2,456 కోట్లు అందుకోనుంది. ప్రభుత్వం తొలుత 32.58 కోట్ల షేర్లు(4 శాతం వాటా) ఆఫర్ చేయగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,380 కోట్ల విలువైన 76.86 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. సెంట్రల్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో తొలిసారి ఓఎఫ్ఎస్కు తెరతీసింది. తాజా ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం పబ్లిక్కు కనీస వాటా(25 శాతం) అంశంలో మరింత ముందుకెళ్లనుంది. ప్రస్తుతం బ్యాంక్లో ప్రభుత్వ వాటా 89.27 శాతంగా ఉంది. ఓఎఫ్ఎస్ తదుపరి 81.27 శాతానికి దిగిరానుంది.
ఓఎఫ్ఎస్ ధర గురువారం ముగింపుతో పోలిస్తే 8.6% డిస్కౌంట్ కాగా.. శుక్రవారం షేరు 8% పతనమై రూ. 31.3 వద్ద ముగిసింది.


