న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో ప్రధాన వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంక్లో పబ్లిక్కు 5.29 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం బ్యాంక్లో 60.72 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించింది.
అయితే ఇందుకు సరైన స్పందన లభించకపోవడంతో ఓఎఫ్ఎస్ అవకాశాలనుప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ధర కంటే దిగువన అదికూడా రెండు సంస్థలు మాత్రమే వాటా కొనుగోలుకి ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే.
పబ్లిక్ వాటా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ మార్కెట్ విలువ పరిమితంగానే నమోదవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్కు కనీసం 10–15 శాతం వాటా కల్పిస్తే బ్యాంక్ షేరుకి తగిన ధర నమోదయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో ఓఎఫ్ఎస్ ద్వారా వాటా విక్రయానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది.


