
ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీని ఈడీ అధికారుల విచారిస్తున్నారు. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు.
టీనా అంబానీ కంటే ముందే అనిల్ అంబానీ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. 2020లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనిల్ అంబానీతో పాటు యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్లపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసులో భాగంగా విచారణకు హాజరైన ఆయనను ఈడీ ప్రశ్నలు సంధించింది. ఆయన సమాధానాలను రికార్డు చేసినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మరోమారు ప్రశ్నించేందుకు నోటీసులు జారీ అయ్యాయి.
రూ.420 కోట్లు ట్యాక్స్ ఎగవేత
2021లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు స్విస్ బ్యాంక్ అకౌంట్లలో రూ.814 కోట్లు ఉండగా.. వాటికి రూ.420 కోట్లు ట్యాక్స్ చెల్లించలేదంటూ నల్లధన నియంత్రణ చట్టం కింద అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేశారు.అంతేకాదు ఉద్దేశపూర్వకంగా తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు వెల్లడించలేదని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ అభియోగాలు మోపింది.
అనిల్ అంబానీకి ఊరట
2021లో ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసుల్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్ట్ అదే ఏడాది సెప్టెంబర్లో అనిల్ అంబానీకి ఊరట కల్పిస్తూ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరింది.
తాజాగా, ఈ కేసులకు సంబంధించి అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీలు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా, మనీ ల్యాండరింగ్ కేసుల్లో అనిల్ అంబానీ దంపతులపై ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.