తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య

Air Passengers Reduced In Flying - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా ఈ సెప్టెంబర్‌లో మొత్తం 39.43 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 66 శాతం తక్కువని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తెలిపింది. అయితే జూలై, ఆగస్ట్‌లతో పోలిస్తే సెప్టెంబర్‌లో విమాన ప్రయాణికులు పెరిగారు. సమీక్షించిన నెలలో అత్యధికంగా ఇండిగో లో  22.6 లక్షల మంది తర్వాతి స్థానంలో స్పెస్‌జెట్‌లో 5.3 లక్షలమంది ప్రయాణించారు. అలాగే ఎయిరిండియా, ఎయిర్‌ఏషియా, విస్తరా, గోఎయిర్‌ విమానాల్లో వరుసగా 3.72 లక్షలు, 2.35 లక్షలు, 2.58 లక్షల మంది ప్రయాణించినట్లు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. 

ఆక్యుపెన్సీ రేటు 57–73 శాతం:  
భారతీయ విమాన సంస్థల ఆక్యుపెన్సీ రేటు సెప్టెంబర్‌లో 57 నుండి 73  శాతం మధ్యలో ఉంది. అత్యధికంగా స్పైస్‌జెట్‌లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. ఇతర ప్రధాన సంస్థలైన విస్తరా, ఇండిగో, ఏయిర్‌ ఏషియా ఇండియా, గోఎయిర్, ఎయిరిండియాల ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 66.7 శాతం, 65.4 శాతం, 58.4 శాతం, 57.9 శాతం, 57.6 శాతంగా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది.

సైకిళ్లకు గిరాకీ పెంచిన కరోనా
న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలతో అల్లాడుతుండగా  భారత్‌లో సైకిళ్ల అమ్మకాలు మాత్రం స్పీడందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో  సైకిళ్ల అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించాయి. ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ, మధ్యస్థాయి గమ్యస్థానాలను చేరుకోవచ్చనే అభిప్రాయంతో పాటు ఆరోగ్య భద్రత, ఫిట్‌నెస్‌ తదితర అంశాల దృష్ట్యా ప్రజలు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో మొత్తం 41,80,945 సైకిళ్లు అమ్ముడుపోయినట్లు అఖిల భారత సైకిల్‌ తయారీ సమాఖ్య(ఏఐసీఎంఏ) తెలిపింది.   కరోనా సంక్షోభంతో ప్రజలకు ఆరోగ్య భద్రత, రోగనిరోధశక్తి పెంపు ఆవశ్యకతల పట్ల అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సైకిళ్ల వాడకమనేది ఆశాజనకంగా మారింది. డిమాండ్‌ ఒక్కసారిగా ఉపందుకోవడంతో పలు నగరాల్లో సైకిళ్ల కొరత ఏర్పడింది. వినియోగదారులు కొత్త సైకిళ్ల రాక కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘దేశవ్యాప్తంగా సైకిళ్లకు అనూహ్యరీతిలో డిమాండ్‌ పెరిగింది. ఈ 5 నెలల్లో అమ్మకాలు 100 శాతానికి వృద్ధిని సాధించాయి.  ఈ స్థాయిలో డిమాండ్‌ నెలకొనడం ఇదే మొదటిసారి కావచ్చు’’ అని ఏఐసీఎంఏ సెక్రటరీ జనరల్‌ కేబీ థాకూర్‌ తెలిపారు.

40శాతం క్షీణించనున్నలగ్జరీ కార్ల మార్కెట్‌!
న్యూఢిల్లీ: భారత లగ్జరీ కార్ల తయారీ మార్కెట్‌ ఈ ఏడాదిలో 40 శాతం క్షీణించే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. పరిశ్రమ డిమాండ్‌ ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన నేపథ్యంలో మొత్తం తయారీ పరిమాణం 40 శాతానికి పైగా తగ్గుతాయని ఇక్రా తెలిపింది. గతేడాది అమ్ముడుపోయిన 35 వేల లగ్జరీ కార్లతో పోలిస్తే ఈ ఏడాదిలో 21వేల కార్లు మాత్రమే అమ్ముడుపోయే అవకాశం ఉందని ఇక్రా అంటుంది.  ఇదే ఏడాదిలో పాసింజర్‌ వాహన (పీవీ) విభాగపు  డిమాండ్‌ నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని రేటింగ్‌ సంస్థ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top