వచ్చే ఏడాదిపై మెజారిటీ రియల్టర్ల అంచనా
క్రెడాయ్–సీఆర్ఈ మ్యాట్రిక్స్ సర్వే
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడంతో వచ్చే ఏడాదిలో (2026) ఇళ్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల 5 శాతం పైగా ఉంటుందని దాదాపు 70 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.
పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15–25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10–15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5–10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు.
స్పెక్యులేషన్ కన్నా డిమాండ్కే ప్రాధాన్యం..
2026 క్యాలెండర్ సంవత్సరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్ సానుకూలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గృహాలకు డిమాండ్ 5 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ జి. పటేల్ తెలిపారు.
టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపరీ్టలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. ఈ వృద్ధి గతిని నిలబెట్టుకోవాలంటే వేగవంతమైన అనుమతులు, రెగ్యులేటరీపరంగా మరింత స్పష్టత అవసరమవుతుందని పటేల్ వివరించారు.
క్లియరెన్స్లను క్రమబదీ్ధకరిస్తే వివిధ మార్కెట్లవ్యాప్తంగా కొత్త గృహాల సరఫరా పెరుగుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాలు పర్యావరణహితంగా, సమంగా అభివృద్ధి చెందగలవని చెప్పారు. డిమాండ్ స్థిరంగా ఉండబోతోందని, ఒక పద్ధతి ప్రకారమే కొత్త గృహాల సరఫరా పెరగబోతోందని నివేదిక తెలియజేస్తోందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు.
హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల పాలసీని సమీక్షిస్తాం
ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి
రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చే విషయంలో తమ పాలసీని పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు.
చాలా సంస్థలు గతంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి రుణాల విషయంలో దూకుడుగా వెళ్లి, చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుల రుణాల్లో ఎస్బీఐ వాటా చాలా తక్కువే ఉంటోంది. అయితే, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగానికి రుణాలను క్రమంగా పెంచుకుంటోంది.
‘ప్రాజెక్టు నిర్వహణ, రిస్కు మేనేజ్మెంటు, పారదర్శకత విషయాల్లో స్థిరత్వం ఉంటే కాస్త నమ్మకం కలుగుతుంది. అలాగే జవాబుదారీతనం కూడా మాలాంటి బ్యాంకులకు కీలకంగా ఉంటుంది. అప్పుడు (పరిశ్రమ) తక్కువ వడ్డీ రేటుకే కన్స్ట్రక్షన్ రుణాలను పొందేందుకు వీలుంటుంది‘ అని క్రెడాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శెట్టి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటే, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించేందుకు వీలవుతుందని శెట్టి సూచించారు.


