రెండు రోజుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌

Published Sat, Dec 24 2022 6:03 AM

20percent ethanol-blended petrol to debut within next couple of days - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర సర్కారు అమల్లో పెట్టనుంది. రెండు రోజుల్లోనే 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఈ20 పెట్రోల్‌) విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్‌ 2023లో భాగంగా ‘డ్యాన్స్‌ టు డీకార్బనైజ్‌’ అనే అంశంపై మంత్రి మాట్లాడారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యానికి 2022 నవంబర్‌ వరకు గడువు ఉన్నప్పటికీ జూన్‌ నాటికే సాధించినట్టు మంత్రి తెలిపారు.

మరో ఒకటి రెండు రోజుల్లో 20 శాతం కలిసిన పెట్రోల్‌ అమ్మకాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదలవుతాయన్నారు. 2023 ఏప్రిల్‌ 1 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం విధించుకోవడం గమనార్హం. కానీ, దీన్ని తాము మరింత ముందుగానే సాధిస్తామని పురి చెప్పారు. దేశవ్యాప్తంగా దీన్ని దశలవారీగా 2025 ఏప్రిల్‌ నాటికి అమలు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడంతోపాటు, రూ.41,500 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. అలాగే, గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ల విడుదల 27 లక్షల టన్నుల మేర తగ్గుతుందని.. రైతులకు రూ.40,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుందని వివరించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement