భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న భద్రగిరి మార్ట్ అటవీ, గిరిజన సేంద్రియ ఉత్పత్తులను ఇకపై ఆన్లైన్లో విక్రయించనున్నారు. గిరిజన మహిళలు, రైతులు తయారు చేసే మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు ఉత్పత్తులు, తేనె, టీ పొడి, పప్పులు, ఆర్గానిక్ బియ్యం వంటి వాటికి డిజిటల్ రెక్కలు తొడగడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులకు మెరుగైన ధర లభిస్తోంది. మార్ట్ ద్వారా సుమారు 100 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుండగా, మరో 10 కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతోందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు.
ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో అక్టోబర్ 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న 12వ జాతీయ కోయ గోండి భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ వర్క్షాప్ ఆహ్వాన పత్రికలను పీఓ బి.రాహుల్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మడివి నెహ్రూ మాట్లాడుతూ ఐటీడీఏ సౌజన్యంతో జరిగే ఈ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, అసోంల నుంచి సుమారు 120 మంది భాషా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు కోండ్రు వీరాస్వామి, పాయం వెంకటరత్నం, కారం దారయ్య, ఇర్ప రాధాకృష్ణమూర్తి, కాక రాజు, కణితి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశాల గడువు
30వరకు పొడిగింపు
ఖమ్మం సహకారనగర్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జి.వీరన్న, ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా తెలిపారు.


