రామాలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే జరగాలి
ఆర్కిటెక్ట్ సూర్యనారాయణకు ఆలయ అర్చకుల సూచన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని ఆలయ ప్రధాన అర్చకులు సూచించారు. చేపట్టబోయే ప్రతి నూతన నిర్మాణంలోనూ కచ్చితంగా భూ స్పర్శ (భూమితో నేరుగా సంబంధం) ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మంగళవారం భద్రాచల క్షేత్రంలో ఆలయ ఈఓ దామోదర్రావు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణలతో కలిసి ప్రధాన అర్చకులు, పండితులు పర్యటించారు. సాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ పనులు కేవలం ఆధునిక హంగులతో సరిపెట్టకుండా, వైఖానస ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. రాతి కట్టడాల ప్రాధాన్యతను కాపాడాలని కోరారు. పరిశీలన అనంతరం ఆలయ పరిపాలనా కార్యాలయంలో ఈఓ అధ్యక్షతన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, ప్రధాన అర్చకులు, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు సమావేశమయ్యారు. రాబోయే కాలంలో భక్తుల రద్దీని తట్టుకునేలా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు. స్వామివారి ఆలయ రూపురేఖలు మారేలా, భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈవో దామోదర్రావు తెలిపారు. అర్చకుల సూచనల ప్రకారం ఆగమ శాస్త్ర ప్రమాణాలను పాటిస్తూనే, పనులు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.


