భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం పవిత్రోత్సావాలకు అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థ బిందెతో జలాన్ని తీసుకొని వచ్చి అంకురార్పణ చేశారు. సోమవారం పవిత్రాధివాసం, అష్టోత్తర కలశావాహన, 25న అష్టోత్తర కలశాలతో స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం జరిపి 28న ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. 28న హయగ్రీవ జయంతి వేడుకలు సైతం జరగనున్నాయి. కాగా పవిత్రోత్సాలను పురస్కరించుకుని నిత్యకల్యాణాలను సోమవారం నుంచి ఈ నెల 28 వరకు రద్దు చేసినట్లు ఆలయ ఈఓ దామోదర్రావు తెలిపారు.
రామయ్యకు అభిషేకం
దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
గోదావరి మాతకు నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి ఆదివారం హారతి ఇచ్చారు. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో దీపోత్సవం జరిపారు. స్వామివారికి 12 సార్లు, గోదా వరి మాతకు 21 సార్లు మంగళహారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రామయ్యకు బంగారు గొలుసు వితరణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి హైదరాబాద్ మణికొండకు చెందిన శ్రీహరి–రాజేశ్వరి దంపతులు బంగారు గొలుసు వితరణ చేశారు. సుమారు రూ.3.50 లక్షల విలువైన శ్రీరాముడి లాకెట్తో కూడిన 24 గ్రాముల బంగారు గొలుసును బహూకరించారని ఆలయ అధికారులు తెలిపారు. దంపతులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు.
అంతరాలయ అభిషేక సేవ తాత్కాలికంగా నిలిపివేత
శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రతీ ఆదివారం నిర్వహించే అంతరాలయ అభిషేక సేవను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఓ దామోదర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవను కేవలం అంతరంగికంగా మాత్రమే నిర్వహిస్తామని, భక్తులకు వీక్షించే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు.
నేటి నుంచి 28 వరకు
నిత్యకల్యాణాలు నిలిపివేత


