భద్రాచలంవాసులు
భీమపాక నగేష్, కాజా శరత్
భద్రాచలంఅర్బన్: భద్రాచలానికి చెందిన జస్టిస్ భీమపాక నగేష్, జస్టిస్ కాజా శరత్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నాలుగేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. న్యాయవాదులుగా వృత్తి జీవితం ప్రారంభించి ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఎదిగారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాలు, భూమి హక్కులు, అటవీ పరిరక్షణ, పేదలు, ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన పలు కీలక అంశాలపై వీరి ధర్మాసనాలు విచారణ జరిపాయి. కాగా భద్రాచలం నుంచి హైకోర్టు వరకు సాగిన వీరి ప్రస్థానం స్థానిక యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నాలుగేళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా న్యాయమూర్తులకు భద్రాచలం బార్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది.
గోదావరి మాతకు హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి కరకట్ట వద్ద ఆదివారం సాయంత్రం శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా గోదావరి మాతకు మొదటి దివ్య హారతులు వైభవంగా నిర్వహించారు. పురోహితులు గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన జరి పారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్, పురోహితులు సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రైళ్లు రద్దు
కొత్తగూడెంఅర్బన్: డోర్నకల్ వద్ద జరుగుతున్న పనులు కారణంగా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి నడిచే రైళ్లు సోమవారం నుంచి మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు స్టేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. 17న సింగరేణి ఎక్స్ప్రెస్, 18, 19న సింగరేణి ఎక్స్ప్రెస్తో పాటు సికింద్రాబాద్–మణుగూరు, కాకతీయ ఎక్స్ప్రెస్, విజయవాడ–భద్రాచలం రైళ్లు రద్దవుతున్నట్లు చెప్పారు.
కిన్నెరసానిలో
సండే సందడి
ఒక్కరోజు ఆదాయం రూ.63,230
పాల్వంచరూరల్: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి డీర్ పార్కులోని దుప్పులు, డ్యామ్పై నుంచి జలాశయాన్ని వీక్షించి బోటు షీకారు చేశారు. 661 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్కు రూ.31,780, సఫారీ వాహనాల ద్వారా రూ.8,900 ఆదాయం లభించింది. 410 మంది బోటింగ్ చేయడం ద్వారా టూరిజం శాఖకు రూ.22,550 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తూనికల్లో మాంసం
విక్రయదారుల మాయాజాలం
ఆరుగురిపై కేసు నమోదు, జరిమానా
పాల్వంచ: మాంసం విక్రయదారులు తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యాన తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని పలు చికెన్ సెంటర్లు, చేపల విక్రయదారులు రెండు రకాల బాట్లను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారంతో జిల్లా తూనికల, కొలతల అధికారి సుభాష్ ఫారెస్ట్ ఆఫీస్ టర్నింగ్ వద్ద, కేఎస్పీ రోడ్, మార్కెట్ ఏరియాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు కేజీకి 200 నుంచి 300 గ్రాముల వరకు తక్కువ తూకం వేస్తున్నట్లు గుర్తించి నలుగురు చేపల విక్రదారులకు, ఇద్దరు చికెన్ సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. తూనికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తేడాలుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.


