జూలూరుపాడు(సుజాతనగర్): కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి సుజాతనగర్ మంగపేట 23వ డివిజన్లో ఇటీవల వీధిలైట్లు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన పారిశుద్ధ్య కార్మికుడు భూక్యా జైత్రామ్(49) ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈక్రమాన కార్పొరేషన్ కార్మికుడు మృతి చెందాడని తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసి మున్సిపల్ కమిషనర్ సుజాత, మేయర్ మూడ్ గణేష్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్తో పాటు ఆర్థిక సాయం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, జైత్రామ్ భౌతికాయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, కమిషనర్, మేయర్లు సందర్శించి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెద్దాడ నగేష్, కార్పొరేటర్లు బోయిన విజయకుమార్, బండి నరసింహా, ధనరాజ్, దినేష్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
భక్తులకు గాయాలు
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తుల కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం అశ్వాపురం సమీపంలోని మొడికుంటకు చెందిన భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు కారులో మేడారానికి వచ్చారు. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో మేడారం సమీపంలో కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టగా.. కారులో ప్రయాణిస్తున్న రవితేజ, దేవిక, హంసవేణిలు గాయపడ్డారు. వీరిని 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు.


