భద్రాచలం: వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నాగార్జున సాగర్లో సోమవారం నిర్వహించిన వరుణ యాగంలో భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి చెందిన అర్చక, ఉద్యోగ బృందం పాల్గొంది. అర్చకులు స్వామివారి తరఫున లాంఛనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ హనుమంతురావుకు రామయ్య ప్రసాదాలను అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి యాగం విశేషలను, ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబాతో పాటుగా అర్చకులు పాల్గొన్నారు.
మనోహరం.. రామయ్య కల్యాణం
రామయ్య కల్యాణం మనోహరంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్టేడియం ప్రాంగణంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పాల్వంచలోని బాపూజీ నగర్కు చెందిన కట్టెకోల యాదగిరిరావు రూ.లక్ష విరాళం అందించారు. ఈఓ దామోదర్రావు వారికి రశీదును అందచేశారు.


