2016 వరకు ఏజెన్సీ డీఈఓ
● ప్రభుత్వం ఆదేశించినా అమలు చేయని అధికారులు ● పర్యవేక్షణ లేక ఫలితాల్లో ఆశ్రమ పాఠశాలల వెనుకబాటు ● గిరిజన విద్య పటిష్టతకు ఇప్పటికే పీఓ కసరత్తు
భద్రాచలం: ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఉట్నూరు ఐటీడీఏలో నియామకం పూర్తి చేశారు. భద్రాచలం ఐటీడీఏలో మాత్రం నియామక ప్రక్రియ ప్రారంభంకాలేదు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉన్నాయి. గిరిజన గురుకులాలు భద్రాద్రి జిల్లాలో 21 ఉండగా, ఖమ్మం జిల్లాలో 6.. మొత్తం 27 ఉన్నాయి. ప్రధానంగా ఆశ్రమ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉండగా, ఇతర శాఖల పర్యవేక్షణ, పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ డీఈఓను నియమిస్తే ఉన్నతాధికారులకు వెసులుబాటు కలగడంతోపాటు విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది.
గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వ ఆదేశాలు
ఇక డీడీ ఉద్యోగ విరమణ, బదిలీ జరిగితే ఇన్చార్జి లతో కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏల్లో డిప్యూటీ డీఈఓలను నియమించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించింది. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన సీనియర్ ప్యానెల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులను డిప్యూటేషన్ పద్ధతిలో ఎంపిక చేయాలని జీఓ కూడా విడుదల చేసింది. ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా కార్యక్రమాలు వంటి బాధ్యతలు నిర్వర్తించాలని జీఓలో పేర్కొంది. అయితే ఐటీడీఏ అధికారులు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా అలసత్వం వీడలేదు.
పీఓ చొరవ చూపాలని..
గిరిజనాభివృద్ధికి, ప్రాథమిక స్థాయిలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రస్తుత ఐటీడీఈ పీఓ రాహుల్ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఉద్దీపకం ప్రాక్టీస్ బుక్లను రూపొందించారు. 1వ తరగతి నుంచే విద్యార్థులతో అభ్యాసనం చేయిస్తుండటంతో చిన్నారుల నైపుణ్యం మెరుగుపడుతోంది. కెరీర్ గైడెన్స్, వంద శాతం ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక వంటివి అమలు చేస్తున్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టు అందుబాటులోకి వస్తే పీఓ, డీడీపై భారం తగ్గుతుందని, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలపై పర్యవేక్షణ పెంచి, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. పీఓ దృష్టి సారించాలని కోరుతున్నారు.
డిప్యూటీ డీఈఓ పోస్టుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పీఓ అనుమతితో ప్రక్రియ ప్రారంభమైంది. నియమ, నిబంధనలను త్వరలో విడుదల చేసి పారదర్శకంగా భర్తీ చేస్తాం. గిరిజనాభివృద్ధికి పాటుపడతాం. –చందన, గిరిజన సంక్షేమ శాఖ
డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ
గతంలో భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన సమయంలో ఈ పోస్టును జిల్లా డీఈఓ పోస్టుగా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్ని రకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతో ఐటీడీఏలో ఏజెన్సీ డీఈఓ పోస్టు మాయమైంది. చివరిగా 2016లో ఇన్చార్జి ఏజెన్సీ డీఈఓగా రవీందర్ బాబు బాధ్యతలు నిర్వర్తించారు.


