పాల్వంచరూరల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణలో పెద్దమ్మతల్లి, శాకంబరేశ్వరుడి అలంకరణలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వితరణ చేసిన కూరగాయలు, పండ్లు, పూలతో ఆదివారం శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారిని అలంకరించారు. ఈ అవతారంలో అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.


