భారీ ర్యాలీ, మన్యం వీరులకు నివాళి
సంప్రదాయ వేషధారణలో హాజరైన పీఓ రాహుల్, ఎమ్మెల్యే వెంకట్రావు
భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిలావ్యాప్తంగా వేడుకలు జరిపారు. ర్యాలీలు నిర్వహించారు. ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. సంప్రదాయ వేషధారణ, నృత్యాలతో అలరించారు. భద్రాచలం అనంతరం గిరిజన భవన్లో నిర్వహించిన సభను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్లో ఆదివాసీ అమరులు అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లుదొర, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివాసీ జెండాను ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఐటీడీఏ సంక్షేమ పథకాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆదివాసీ వేషధారణలో పీఓ, ఎమ్మెల్యే సందడి చేశారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివాసీలతో మమేకమై నృత్యం చేశారు. సంప్రదాయ ఆభరణాలు, వెండితో తయారు చేసిన కంటె, రూపాయి మాలను ధరించారు. డోలు వాయించి, బాణం ఎక్కుపెట్టి ఆదివాసీల్లో జోష్ నింపారు. పీఓ తన కుమారుడికి కూడా ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరింపజేశారు.
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


