బూర్గంపాడు: అసలే వర్షాభావ పరిస్థితుల్లో ఆలస్యంగా పంటలు సాగు చేసుకున్నారు. ఇప్పుడు అవి కూడా వరదపాలయ్యాయి. గోదావరి వరద ఉధృతితో పరీవాహక ప్రాంతాల్లోని బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో పంటచేలు నీటమునిగాయి. బుధవారం 18 అడుగులు ఉన్న గోదావరి వరద శుక్రవారం రాత్రి 50 అడుగులకు చేరింది. కేవలం 36గంటల వ్యవధిలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పత్తి చేలు, వరి మాగాణులు, జామాయిల్ తోటల్లోకి వరదనీరు చేరింది. విద్యుత్ మోటార్లు, డీజిల్ ఇంజన్లు, వ్యవసాయ పనిముట్లు నీటమునిగాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో సుమారు 1800 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. వాగులు, వంకల్లోకి నీరు పొలాలకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. వరద పెరుగుతుండటంతో మేతకు వెళ్లిన పశువులు, జీవాలను కాపరులు శుక్రవారం మధ్యాహ్ననికే ఇంటిదారి పట్టించారు. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు పడవలు, వలలతో ఒడ్డుకు చేరుకున్నారు.
బూర్గంపాడు–సారపాక రహదారిపైకి వరద నీరు
బూర్గంపాడు–సారపాక రహదారిపైకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతానికి రాకపోకలు కొనసాగుతున్న మరో రెండు అడుగుల మేర వరద పెరిగితే రాకపోకలు నిలిచిపోనున్నాయి. వరద మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు సమీపిస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోడ్లపైకి నీరు చేరే ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


