అరకొర కేటాయింపులు..
● నియోజకవర్గాలకు చేరిన గిఫ్టు ప్యాకెట్లు ● ఇఫ్తార్ విందుకు కూడా నిధులు కేటాయింపు ● అరకొర కేటాయింపులతో ముస్లింల్లో నిరాశ
అశ్వారావుపేటరూరల్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు తోఫా(గిఫ్టు)తోపాటు ఉపవాస దీక్షదారులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 26 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మైనార్టీ శాఖ ద్వారా ఆయా గిఫ్టు ప్యాకెట్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చేరగా, మండలాల వారీగా లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొత్తం 4 వేల గిఫ్టు ప్యాకెట్లు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గానికి అత్యధికం మంజూరు కాగా, భద్రాచలం నియోజకవర్గానికి అతి తక్కువగా మంజూరు చేశారు. తోఫా ప్యాకెట్లో మహిళల కోసం చీర, జాకెట్, పంజాబీ డ్రెస్, పురుషులకు లాల్చీ, పైజామా ఇవ్వనున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో మసీదు కమిటీలను భాగస్వామ్యం చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇఫ్తార్కు నిధులు కేటాయింపు
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు నిధులు కేటాయించారు. ఒక్కో మసీదుకు రూ. లక్ష చొప్పున జిల్లాలో 16 మసీదులకు రూ.16 లక్షలు మంజూరు చేశారు. వాస్తవంగా జిల్లాలో 149 మసీదులు గుర్తింపు పొంది ఉండగా, కేవలం 16 మసీదులకే నిధులు కేటాయించడంపై నిరాశ వ్యక్తమవుతోంది. జిల్లాలో 63వేల మంది ముస్లిం జనాభా ఉండగా, కేవలం 4 వేల గిఫ్టు ప్యాకెట్లు కేటాయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. అరకొర కేటాయింపులతో ప్రభుత్వం ముస్లింలను చిన్నచూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గం తోఫా ప్యాకెట్లు
కొత్తగూడెం 1250
అశ్వారావుపేట 750
పినపాక 750
ఇల్లెందు 750
భద్రాచలం 500
రంజాన్ మాసం పురస్కరించుకొని రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు గిఫ్టులు, ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించడం హర్షణీయం. గిఫ్టులు, ఇఫ్తార్ విందు నిధులు అరకొరగా కేటాయించడం సరికాదు. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలి. – ఎండీ యాకూబ్ పాషా,
మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


