
సరికొత్త నమూనా..
● శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రణాళిక● ఇటీవల రామాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఆర్కిటెక్ట్ ● బడ్జెట్కు తగినట్లుగా అభివృద్ధి పనుల ప్రతిపాదన ● మాస్టర్ప్లాన్లో ‘సాక్షి’ సూచనలకు చోటు
ఆలయ
కొత్త
నమూనా
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి సరికొత్త నమూనా రూపుదిద్దుకుంటోంది. తాజా ప్రణాళికలో ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులూ చేయకుండా ఇతర అభివృద్ధి పనులనే ప్రతిపాదించారు. దీంతో పదకొండేళ్లుగా రామాలయ మాస్టర్ ప్లాన్పై కమ్ముకున్న మబ్బులు వీడినట్లయింది. వైదిక కమిటీ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాక చేర్పులు మార్పులతో ప్రణాళిక తుదిరూపు దాల్చ నుంది. కాగా మూడు రోజుల క్రితం ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రామాలయాన్ని సందర్శించి, మాస్టర్ ప్లాన్పై చర్చించిన విషయం విదితమే.
ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శ్రీరామ నవమికి వచ్చిన నాటి సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రధాన ఆలయంతో సహా సమూల మార్పులను సూచిస్తూ ప్రణాళిక రూపొందించారు. అనంతర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మాస్టర్ప్లాన్ నమూనాలకే పరిమితమైంది. దీంతో అప్పటి ప్రభుత్వం విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి మాఢ వీధుల విస్తరణకు రూ.60 కోట్లు ప్రకటించారు. ఇప్పటికే రూ.36 కోట్లను నిర్వాసితులకు అందించి భూ సేకరణ చేపట్టారు. ఇక ఆలయ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను మరో ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తికి అప్పగించింది. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆయన మాస్టర్ప్లాన్ రూపొందించారు. ప్రధాన ఆలయానికి ఎటువంటి మార్పులూ లేకుండా కేవలం పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులతోనే నూతన నమూనా తయారుచేశారు. ఆలయ వైదిక కమిటీ, కలెక్టర్, ఇతరుల సలహాలు, సూచనల అనంతరం డిజైన్ను ఫైనల్ చేయనున్నారు. కాగా నేల విడిచి సాము చేయకుండా ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్కు అనుగుణంగా ఆ ప్లాన్ సిద్ధం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాస్టర్ ప్లాన్లో ‘సాక్షి’ సూచనలు
రామాలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ ఆవశ్యకత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేస్తూ ‘సాక్షి’ పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాదాపుగా ఆ సూచనలన్నింటినీ కొత్త ప్లాన్లో పొందుపరిచారు. వాగ్గేయకారులకు సముచిత స్థానం కల్పించాలని, హనుమాన్ జయంతి, ఇతర ఉత్సవాలలో భక్తులకు, మాలధారులకు భజన మందిరం ఉండాలని కథనాల్లో పేర్కొనగా, పరిగణనలోకి తీసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించేందుకు తూము రామదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజాను పేర్లతో వేదిక నిర్మించాలని ప్లాన్లో పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు భద్రాచలంలో భక్తులకు వసతి కల్పించాలని సూచనలు చేయగా, బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంలో రూ. 82 కోట్లతో హోటళ్లు, వసతి నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. దీంతో భక్తులు, స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
● ఆధ్యాత్మికత, టూరిజం హబ్గా మారుతున్న భద్రాచలంలో రామాయణ థీమ్ పార్కును దేవస్థానం పరిసర ప్రాంతాల్లోనే నిర్మించాలి.
● ఆలయ ఎగువ భాగాన ఉన్న కుసుమ హరినాధ ఆలయం వైపుగా అభివృద్ధి చేస్తే ఆలయ వీక్షణంతో పాటు ఉపాలయాలు అభివృద్ధి అవుతాయి.
● దేవస్థానం నుంచి గోదావరి ఒడ్డు వరకు ఊయల వంతెన నిర్మించాలి. ప్లాన్లో వంతెన ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆర్కిటెక్ట్కు సూచించారు.
● కాశీ మాదిరిగా నదీ హారతికి గోదావరి ఒడ్డున శాశ్వత వేదికను నిర్మించాలి. గోదావరి ఒడ్డు నుంచి దేవస్థానం ప్రధాన గోపురం కనపడేలా ఏర్పాట్లు చేయాలి.
● వాగ్గేయకారులకు సముచిత స్థానం కల్పించాలి. హనుమాన్ జయంతి, ఇతర ఉత్సవాల కోసం భజన మందిరం నిర్మించాలి.
● గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలి. వీటన్నింటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు.
● పార్కింగ్ సమస్యను తీర్చేందుకు పార్కింగ్ కేంద్రం, గోశాల అభివృద్ధి ఇతర పనులను డిజైన్లో పొందుపర్చారు.

సరికొత్త నమూనా..

సరికొత్త నమూనా..