సీపీఐ నేత నారాయణ ఆరోపణలు సరికాదు
సింగరేణి(కొత్తగూడెం): సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తమ పార్టీపై చేస్తున్న ఆరోపణలు సరికాదని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి జలగం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 42 చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జలగం కుమారు డు జలగం వెంకట్రావు మా పార్టీ (ఏఐఎఫ్బీ) సింహం గుర్తుపై కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. వెంకట్రావు గెలుస్తాడనే అక్కసుతో నారాయణ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి, పార్టీ సభ్యత్వం తొలగించిన రామరాజు అనే వ్యక్తితో కొత్తగూడెంలో ప్రెస్మీట్ పెట్టించటం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. అమ్ముకోవటం, అమ్ముడుపోవటం నారాయణకు అలవాటని, ఆ గుణాన్ని తమపై రుద్దవద్దని పేర్కొన్నారు. నాయకులు కోమటిరెడ్డి, తేజ్దీప్రెడ్డి, బండారి శేఖర్ పాల్గొన్నారు.