మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు.
గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు.


