కర్లపాలెం: గంజాయి అమ్మినా, తాగినా, నిల్వ చేసినా చట్టప్రకారం నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి చెప్పారు. గురువారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చంద్రమౌళి రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్రతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో గల ఎంపీఎఫ్సీ గోదాములో కొంతమంది వ్యక్తులు గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నట్లు సమాచారం అందటంతో కర్లపాలెం ఎస్ఐ తమ సిబ్బందితో పాటు సీసీఎస్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, ఇద్దరు మధ్యవర్తులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 500గ్రాముల గంజాయి, రూ.వెయ్యి నగదు, ఓ ఎస్యూవీ వాహనం, మూడు సెల్ఫోన్లు, 8 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కర్లపాలెం గ్రామానికి చెందిన ప్రస్తుతం చెరుకుపల్లిలో నివాసం ఉంటున్న మున్నంగి మణికంఠ, చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నపల్లి రోషన్, అలియాస్ శాస్త్రి, చెరుకుపల్లి మండలం నడుంపల్లి గ్రామానికి చెందిన ఖాజా కేశవ్ శ్రీరామ్, నగరం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన గోనతోటి సుధాకర్, అలియాస్ సోనూ ఉన్నారని డీఎస్పీ తెలిపారు. మున్నంగి మణికంఠపై గతంలో కర్లపాలెం, నర్సీపట్నం, కేడిపేట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు స్టువార్టుపురం వృక్షనగర్కు చెందిన మెండ్రగుట్టి ప్రతాప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. గంజాయి విక్రేతలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రవీంద్రను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
500 గ్రాముల గంజాయి, వాహనం సీజ్


