పశుసంతతితో లాభాలు
బల్లికురవ: పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎస్ఎస్ఎస్ ద్వారా గర్భధారణతో పశుసంతతి పెంచుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బి. మురళీ కృష్ణ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని వైదన గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్త సహ కారంతో ఉచిత పశువైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో 37 గేదెలకు చూడి పరీక్షలు 151 గేదెలు, దూడలు, గేదెలకు నట్టల నివారణ మందు అందజేశారు. డీడీ మాట్లాడుతూ పాడిపరిశ్రమలో మెలకువలతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, చికిత్సలతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ పాలు ఉత్పత్తి పెంచుకోవాలని కోరారు. శిబిరంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి
కర్లపాలెం: ప్రమాదవశాత్తు బైక్తో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని పేరలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. కర్లపాలెంం ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన అమర్తలూరి హర్షవర్థన్(25) కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు తమ బంధువుల ఇంటికి వచ్చాడని తెలిపారు. తిరిగి స్వగ్రామం పేరాలకు బైకుపై వెళుతున్న నేపథ్యంలో పేరలి మంచినీటి చెరువు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ప్రమాదవశాత్తు బైక్ ఢీ కొనటంతో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ రైలు ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ మధ్య నూతన ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు.
గుంటూరు రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం
లక్ష్మీపురం: నాన్–ఫేర్ రెవెన్యూ చొరవలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్, గుంటూరు రైల్వే స్టేషన్న్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ఫారంలో మంగళవారం ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన స్లీపింగ్ ప్యాడ్స్ను ఆమె ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను, బెడ్స్, వాష్ రూమ్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం మొత్తం 64 పడకల సామర్ధ్యాన్ని కలిగి ఉందన్నారు.
చిలకలూరిపేటలో పోక్సో కేసు నమోదు
చిలకలూరిపేట టౌన్: ఓ యువకుడిపై రూరల్ పోలీస్స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన బాలిక తన అమ్మమ్మ ఊరైన చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామానికి ఇటీవల సెలవులపై వచ్చింది. ఈ క్రమంలో చిరుమామిళ్ల గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి గ్రామం నుంచి బాలికను తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. మంగళవారం పసుమర్రు వంతెన వద్ద యువకుడిని అరెస్టు చేసి కోర్టు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.
పశుసంతతితో లాభాలు


