అలల తాకిడికి గురై హైదరాబాద్‌ యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

అలల తాకిడికి గురై హైదరాబాద్‌ యువతి మృతి

Oct 16 2023 1:54 AM | Updated on Oct 16 2023 11:39 AM

మృతి చెందిన సమియా - Sakshi

మృతి చెందిన సమియా

చీరాల టౌన్‌: అంతవరకు కుటుంబసభ్యులతో కలి సి సరదాగా అలలతో సంతోషంగా ఆడుకుంది. బహుషా ఆ సంతోషాన్ని తట్టుకోలేక అలలు యువతిని తనలోకి లాగేసుకొని ప్రాణాలు తీశాయి. కుటుంబ సభ్యులతో వాడరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన కుటుంబంలో విహారం విషాదాన్ని నింపింది. చీరాల రూరల్‌ ఈపురుపాలెం ఎస్‌ఐ పి.జనార్దన్‌ వివరాల మేరకు.. దసరా సెలవుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నాంపల్లికి చెందిన సమియా (24) కుటుంబ సభ్యులు నలుగురితో ఆదివారం ఉదయాన్నే వాడరేవుకు చేరుకున్నారు.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీరంలో సముద్రంలో స్నానం చేస్తుండగా సమియా ఒక్కసారిగా అలల తాకిడికి గురైంది. సమీపంలోని మత్య్సకారులు, తోటి పర్యాటకులు అలల తాకిడికి గురై సముద్రంలో కొట్టుకుపోతున్న సమియాను రక్షించి హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమియా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చిన ఓ కుటుంబంలో సముద్రం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన తమ కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలలో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జనార్దన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement