న్యూస్రీల్
దగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి దశలవారీగా ఆందోళనకు వైఎస్సార్ సీపీ సిద్ధం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బాపట్ల: దగా డీఎస్సీకి సూత్రధారిగా ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ జేసీకి శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ, దేశంలోనే ఒక్కసారిగా 1.40 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేశారని గుర్తు చేశారు. కేవలం 16 వేల మందితో కూడిన డీఎస్సీలో తమ వర్గీయులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అక్రమాలకు లోకేష్ పాల్పడటం బాధాకరమన్నారు. నీట్లో అవకతవకలు జరిగితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా చంద్రబాబు కూడా తన కుమారుడిని బాధ్యుడిని చేస్తూ రాజీనామా చేయించాలని కోన డిమాండ్ చేశారు. డీఎస్సీపై బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 4వ తేదీన టౌన్హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6, 7, 8, 9 తేదీల్లో నిరాహార దీక్షలు, 10వ తేదీన రోడ్డుపై నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. డీఎస్సీపై సీబీఐతో విచారణ, నిరుద్యోగ భృతి ఇవ్వడం, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని, కూటమి ప్రభుత్వం దిగొచ్చేవరకు దీనిని కొనసాగిస్తామని చెప్పారు.
జేసీకి వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు కోన, నందిగం, కరణం, వరికూటి, పీటా
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ఎంపీ నందిగం సురేష్బాబు పేర్కొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం ఒకపక్క కొనసాగుతుంటే, మరోవైపు నిరుద్యోగులను నట్టేట ముంచేందుకు లోకేష్ కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నరమేధం విషయంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకపక్క కేంద్ర విద్యాశాఖలో పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో మంత్రి రాజీనామా చేస్తే, ఇక్కడ జీవితాలు తలకిందులు చేసిన డీఎస్సీ స్కాంలో లోకేష్ కుర్చీ పట్టుకుని ఉండటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఇప్పటికై నా ప్రజాగ్రహాన్ని తెలుసుకుని నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రేపల్లె, చీరాల, వేమూరు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పీటా నాగ మోహనకృష్ణ, కరణం వెంకటేష్బాబు, వరికూటి అశోక్బాబులు ఉన్నారు.


