కడప కార్పొరేషన్: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో వారు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తిరుపతి, తిరువణ్ణామలై మార్గం రెండు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఎంతో ముఖ్యమైందని ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. రహదారి విస్తరణ, అవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ...వెంటనే డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎంపీలు వివరించారు.
జాతీయ రహదారుల శాఖ మంత్రి
నితిన్ గడ్కరికీ వైఎస్సార్సీపీ ఎంపీల వినతి


