రాజంపేట: రైల్వే పరంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నందలూరు రైల్వే కేంద్రంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టమైన హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రైల్వేమంత్రిని ఆయన స్వయంగా కలిసి నందలూరు అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం నందలూరులో ఉన్న ఆర్యూబీ అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల బస్సులు, లారీలు, అత్యవసర అంబులెన్స్ వాహనాల రాకపోకలకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీ మంత్రికి వివరించారు ఈ క్రమంలో ఇక్కడ ఆర్వోబీ నిర్మాణం ఎంతో అత్యవసరమని స్పష్టం చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే నందలూరు రైల్వే కేంద్రంలో గతంలో ఉన్న రైళ్లకు వాటరింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేడా రఘునాథరెడ్డి వెల్లడించారు. గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ప్రయాణించే అన్ని సుదూర ప్రాంత రైళ్లకు వాటరింగ్ సౌకర్యం కల్పించడానికి నందలూరు కేంద్రం భౌగోళికంగా ఎంతో అనుకూలమన్నారు.
డీపీటీఓగా శశిభూషణ్
మదనపల్లె సిటీ: జిల్లా ప్రజారవాణాధికారి(డిపిటిఓ)గా ఎం.శశిభూషణ్ను నియమిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా బనగానిపల్లె ఆర్టీసీ డీఎంగా పని చేస్తున్న ఆయన్ను పదోన్నతిపై డీపీటీఓగా నియమించారు. నూతన డీపీటిఓను మదనపల్లె ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
పెరిగిన హుండీ ఆదాయం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జులై నెల నుంచి ఆగస్టు 11 వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను టీటీడీ పరకామణీ సిబ్బంది లెక్కించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 10,41,340 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గత నెల హుండీ ఆదాయంతో పోలిస్తే ఈ నెల సుమారు రూ. 4 లక్షల ఆదాయం పెరిగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ముగిసిన ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్షిప్ పోటీలో సత్తా చాటి జిల్లా ఖ్యాతిని చాటాలని స్టెప్ సీఈఓ ప్రసాదరావు, డీఎస్డీఓ గౌస్ బాషా పేర్కొన్నారు. అమరావతి చాంపియన్షిప్ 2026 పోటీల్లో భాగంగా మంగళవారం కడప మున్సిపల్ గ్రౌండ్, ఇండోర్ స్టేడి యంలో జరిగిన బాల బాలికల అండర్ 17, 23 విభాగాల్లో బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, కబడ్డీ, వాలీబాల్, చెస్ క్రీడాంశాల పోటీలను ప్రారంభించారు. పోటీలను సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: ఏలూరులోని డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల డా. బీఆర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ–154 స్టడీ సెంటర్ ప్రిన్సిపల్ స్మిత, కో ఆర్డినేటర్ ఖాజామెహిద్దీన్లు తెలిపారు. డీగ్రీ మొదటి సంవత్సరం బీఏ, బీకాం, బికాం కమ్యూటర్స్, బీఎస్సీ, బీఎస్సీ కంప్యూటర్స్, బ్యాచిలర్ ఆప్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటిఐ, డిప్లామా కోర్సులు రెండు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు.


